వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

10 వ శ్లోకం

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||1-10|| .

భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది.
ఇప్పుడు ప్రశ్న ఇరువైపులా సమానమైన సైన్యం ఉంటె మరి విజయం కౌరవులను ఎలా వరిస్తుంది అనుకుంటున్నాడు రారాజు అని. దానికి సమాధానంగా చెబుతున్నాడు, తమ సైన్యం అనంతమైనది అని. తన భయాన్ని బయటకు ప్రకటించకుండా ఉండేందుకు తనకు తాను సమాధానపరచుకుంటూ తన గురువులకు చెబుతున్నాడు, తన సైన్యం అనంతమైనది అని, అందునా ఎంతో చతురత, యుద్ధ విశారదత కలిగిన మహారధి భీష్ముని పర్యవేక్షణలో ఉందని, అటువైపు తక్కువ తెలివి కలిగిన భీముని పర్యవేక్షణలో ఉన్న వారి సైన్యం కన్నా మనమే ఎక్కువ అని. కాబట్టి కౌరవుల విజయం తధ్యమని నొక్కివక్కాణిస్తున్నాడు.

అట్టి సైన్యం భీష్మ పితామహునిచే సురక్షితమై,అపరిమితమై,అజేయమైయున్నది. పాండవుల సైన్యము భీమునిచే రక్షింపబడుతూ పరిమితమై,జయింప సులభమైయున్నది.
దుర్యొధనుని దుర్భుద్ది స్పష్టమగుచున్నది. తన సైన్యమును ప్రశంసించుచూ, పాండవసైన్యమును తక్కువ జేసి చెప్పుచున్నాడు. తన సైన్యము 11 అక్షౌహిణులని,పాండవుల సైన్యము 7 అక్షౌహిణులే గదాయని భావించి యుండ వచ్చును.

అక్షౌహిణి

భారతీయ కొలమానంలో అక్షౌహిణి ఒక కొలత. సైన్యాన్ని అక్షౌహిణిలో కొలుస్తారు. కంబ రామాయణంలో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆదిపర్వం బట్టి సైన్యగణాంకాలలో పునాది నిష్పత్తి 1 రథము : 1 ఏనుగు : 3 గుర్రాలు : 5 కాలిబంట్లు.
అక్షౌహిణి రథములు ఏనుగులు గుఱ్ఱములు కాలిబంట్లు
01 21,870 21,870 65,610 1,09,350
వివిధ ప్రమాణాలు
పత్తి
ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు మరియు ఐదు కాలిబంట్లు కలిస్తే ఒక "పత్తి" అంటారు.
1 రథములు + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు
సేనాముఖము
మూడు పత్తులు ఒక సేనాముఖము అనగా సేనాముఖము = 3 X పత్తి
3 రథములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు
గుల్మము
మూడు సేనాముఖములు ఒక గుల్మము. అనగా గుల్మము = 3 X సేనాముఖము
9 రథములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు
గణము
గణము అనగా మూడు గుల్మములు అనగా గణము = 3 X గుల్మము
27 రథములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు
వాహిని
వాహిని అనగా మూడు గణములు. అనగా గణము =3 X గణము
81 రథములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు
పృతన
పృతన అనగా మూడు వాహినులు అనగా పృతన=3 X వాహినులు
243 రథములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు
చమువు
చమువు అనగా మూడు పృతనల సైన్యము. అనగా 3 Xపృతన
729 రథములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు
అనీకిని
అనీకిని అనగా మూడు చమువుల సైన్యము. అనగా 3 Xచమువు.
2187 రథములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు
అక్షౌహిణి
అక్షౌహిణి అనగా పది అనీకినుల సైన్యము అనగా 10 X అనీకిని
21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు
ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధములో పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రథములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు
ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే, రథబలం 7,87,329 కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,329 కి చేరుకుంటుంది.
రకం ఎన్నింతలు రథములు ఏనుగులు గుర్రాలు కాలిబంట్లు సారథి
పత్తి 1 1 1 3 5 పత్తిపాలుడు
సేనాముఖము 3 3 3 9 15 సేనాముఖి
గుల్మము 3*3 9 9 27 45 నాయకుడు
గణము 33 27 27 81 135 గణనాయకుడు
వాహిని 34 81 81 243 405 వాహినిపతి
పృతన 35 243 243 729 1215 పృతనాధిపతి
చమువు (సేనా) 36 729 729 2187 3645 సేనాపతి
అనీకిని 37 2187 2187 6561 10935 అనీకాధిపతి
అక్షౌహిణి 10*37 21870 21870 65610 1,09,350 మహా సేనాపతి

మరిన్ని ప్రమాణాలు

అక్షౌహిణి X '18' = ఏకము
ఏకము X '8' = కోటి (ఈ కోటి మన కోటి కాదు)
కోటి X '8' = శంఖము
శంఖము X '8' = కుముదము
కుముదము X '8' = పద్మము
పద్మము X '8' = నాడి
నాడి X '8' = సముద్రము
సముద్రము X '8' = వెల్లువ
అంటే 36,691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు.
ఇటు వంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే 366917139200 X 70 = 256842399744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు. వీరికి నీలుడు అధిపతి.
256842399744000 మంది బలవంతులు కలిసి త్రేతాయుగములో (1,700,000 సంవత్సరాల పూర్వం) లంకకు వారధి కట్టారన్నమాట.
మహారధుడు - మహాభారత యుద్ధంలో ఒక వీరుని స్థాయిని నిర్ణయించే ప్రమాణం

ఉపనిషత్తుల విభాగాలు



ఉపనిషత్తులు వేదసారమనీ, వేదరహస్యమనీ వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు వెయ్యిన్నీ ఎనిమిది ఉపనిషత్తులు ఉండేవనీ, ఇప్పుడు నూట ఎనిమిది మాత్రం లభ్యమవుతున్నాయనీ అంటారు. అందులోనూ పది మాత్రం ముఖ్యమైనవనీ, వాటికి మాత్రమే శంకరులు భాష్యం వ్రాశారనీ అంటారు. అవి: 1. ఈశోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నో పనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూ క్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోప నిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు.
వ, వైష్ణవ వర్గాల వారు తమవిగా భావించే ఉపనిషత్‌ వర్గీకరణ ఒకటి ఉంది.
శైవులు తమవని భావించే ఉపనిషత్తులు పదిహేను ఉన్నాయి: 1. అక్షమాలికోపనిషత్తు, 2. అథర్వ శిరోపనిషత్తు, 3. అథర్వ శిఖోపనిషత్తు, 4. కాలాగ్ని రుద్రోపనిషత్తు, 5. కైవల్యోపనిషత్తు, 6. గణపతి ఉపనిషత్తు, 7. జాబాలోపనిషత్తు, 8. దక్షిణామూర్తి ఉపనిషత్తు, 9. పంచబ్రహ్మోపనిషత్తు, 10. బృహజ్జాబాలోపనిషత్తు 11. భస్మజా బాలోపనిషత్తు, 12. రుద్రహృదయో పనిషత్తు, 13. రుద్రాక్ష జాబాలోపనిషత్తు, 14. శరభోప నిషత్తు, 15. శ్వేతాశ్వతరో పనిషత్తు.
వైష్ణవులు తమవిగా చెప్పే పదునాలుగు ఉపనిషత్తులు: 1. అవ్యక్తోప నిషత్తు, 2. కలిసంతరణోపనిషత్తు, 3. కృష్ణోప నిషత్తు, 4. గారుడోపనిషత్తు, 5. గోపాలతాప సోపనిషత్తు, 6. తారసోపనిషత్తు, 7. త్రిపాద్వి భూతి ఉపనిషత్తు, 8. దత్తాత్రేయో పనిషత్తు, 9. నారాయణోపనిషత్తు, 10. నృసింహ తాపసీయోపనిషత్తు, 11. రామ తాపస ఉపనిషత్తు, 12. రామరహస్యో పనిషత్తు, 13. వాసుదేవ ఉపనిషత్తు, 14. హయగ్రీవ ఉపనిషత్తు.
సన్యాసానికి సంబంధించిన లక్షణాలను, విధి విధానాలను తెలియజేసే 17 ఉపనిషత్తులను సన్యాసోపనిషత్తులని వర్గీకరించారు. అవి: 1. అరుణికోపనిషత్తు, 2. అవధూతోపనిషత్తు, 3. కఠశ్రుత్యుపనిషత్తు, 4. కుండినోపనిషత్తు, 5. జాబాలోపనిషత్తు, 6. తురీయాతీత అవధూతోపనిషత్తు, 7. నారద పరివ్రాజకో పనిషత్తు, 8. నిర్వాణోపనిషత్తు, 9. పరబ్రహ్మోపనిషత్తు, 10. పరమహంస పరివ్రాజకోపనిషత్తు, 11. పరమహంసో పనిషత్తు, 12. బ్రహ్మోపనిషత్తు, 13. భిక్షుక ఉపనిషత్తు, 14. మైత్రేయ ఉపనిషత్తు, 15. యాజ్ఞవల్క్య ఉపనిషత్తు, 16. శాట్యాయన ఉపనిషత్తు, 17. సన్యాసో పనిషత్తు.

ఉపనిషత్తుల సంఖ్య


ఉపనిషత్తులు ఎన్ని అనే ప్రశ్నకు అందరినీ సంతృప్తిపరచే సమాధానం లేదు. శంకరుడు వ్యాఖ్యానించిన ఈశకేనాది పది ఉపనిషత్తులే బహుళ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ తరచు మరికొన్ని ఉపనిషత్తుల ప్రస్తావన విన వస్తుంటుంది. ముక్తికోపనిషత్తు 108 ఉపనిషత్తులను ప్రస్తావిస్తున్నది. ఒక్కొక విశ్వాసం వారు ఒక్కొక్క విధంగా ఉప నిషత్తులను తమకు అనుకూలంగా ఉదహరిస్తున్నారు. ప్రామాణికంగా చెప్పడానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు జాబాలి పేరు అనేక విధాలుగా ఉపనిషత్తుల పట్టికలో దర్శనమిస్తుంది. ఏమైనప్పటికీ, వైదిక వాఙ్మయంలో ఉపనిషత్తుల స్థానం విశిష్టమైనది. ఉపనిషత్తు అనే పదానికి సవిూపానికి తీసుకునిపోవడం అనే అర్థం ఉన్నదనీ, మనిషి తన పరిమితమైన చైతన్యాన్ని, ప్రజ్ఞను బ్రహ్మ చైతన్యంతో, ప్రజ్ఞతో అనుసంధానం చేసి పరిమితత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందడానికి ఉపయోగపడే మోక్షవిద్య ఉపనిషత్తులలో ఉన్నదని కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య అంటారు. ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది
ఋగ్వేదానికి సంబంధించినవి - 10
కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి - 32
శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి - 19
సామవేదానికి సంబంధించినవి - 16
అధర్వణ వేదానికి సంబంధించినవి - 31 (మొత్తం - 108)
భీష్ముడు ఇచ్చిన అయిదు బాణాల కథ

మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఇంతచేసినా కూడా వారికి వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు ఒప్పుకోలేదు. కనీసం ఐదు ఊళ్లన్నా ఇప్పించమన్న కృష్ణుని రాయబారమూ చెల్లలేదు. దాంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. కౌరవులు యుద్ధానికి మంచి సందడిగా సన్నద్ధమయ్యారే కానీ, ఒకో రోజూ గడిచే కొద్దీ పాండవులదే పైచేయిగా కనిపించసాగింది.

యుద్ధంలో తగులుతున్న ఎదురుదెబ్బలకి దుర్యోధనుడి దిమ్మ తిరిగిపోయింది. మనసులో కసి పెరిగిపోయింది. ఓ రోజు రాత్రి ఆ కోపంలో భీష్ముని శిబిరంలోకి అడుగుపెట్టాడు. ‘తాతా! నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప యోధుడివి. కానీ ఐదుగురు పాండవులని చంపలేకపోతున్నావంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు మా పక్షాన ఉంటూనే వారికి సాయపడుతున్నావేమో అని అనుమానంగా ఉంది,’ అంటూ భీష్ముని తూలనాడాడు.

దుర్యోధనుడు తన విశ్వాసాన్ని శంకించడంతో భీష్ముని మనసు గాయపడింది. పాండవులని ఓడించేందుకు తాను శాయశక్తులా పోరాడుతున్నానని ఎంతగా చెప్పినా లాభం లేకపోయింది. దాంతో తన విల్లంబులోంచి ఓ ఐదు బాణాలు బయటకి తీశాడు భీష్ముడు. వాటిని తన చేత పట్టుకుని ఏవో మంత్రాలు జపించాడు. ఆ తర్వాత వాటిని దుర్యోధనునికి చూపిస్తూ- ‘నా శక్తి యావత్తూ ఈ ఐదు బాణాలకీ ధారపోశాను. వీటితో నువ్వు ఆ పంచపాండవులనీ సంహరించగలవు. రేపు ఉదయం యుద్ధభూమిలో నేను నీకు ఈ బాణాలను అందిస్తాను,’ అని చెప్పాడు.

భీష్ముని చేతిలో ఉన్న ఐదు బాణాలని చూడగానే దుర్యోధనుడి ప్రాణం లేచి వచ్చింది. కానీ వాటిని ఆ రాత్రి భీష్ముని దగ్గర ఉంచేందుకు మాత్రం మనసు ఒప్పలేదు. భీష్ముడు అసలే పాండవుల పక్షపాతి అని అతని అనుమానం. తెల్లవారేసరికి అతని మనసు మారిపోతే ఇంకేమన్నా ఉందా! ఆ బాణాలను పాడుచేసినా ఫర్వాలేదు... పోయిపోయి ఆ పాండవుల చేతికి ఇస్తే తన ప్రాణాలకే ముప్పు కదా! అందుకనే భీష్ముడు వద్దంటున్నా వినకుండా ఆ బాణాలను తనతో పాటు తీసుకుని బయల్దేరాడు.

దుర్యోధనుడికీ, భీష్ముడికీ మధ్య జరిగినదంతా గూఢచారుల ద్వారా శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. రేపు యుద్ధభూమిలో దుర్యోధనుడు ఆ ఐదు బాణాలనీ ప్రయోగిస్తే ఇంకేమన్నా ఉందా! అనుకున్నాడు. ఈ ఆపాయానికి విరుగుడా ఉపాయం ఏమిటా అని ఆలోచించాడు. వెంటనే అతనికి అర్జునుడు గుర్తుకువచ్చాడు. పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి దుర్యోధనుడు వారుండే ప్రాంతానికి దగ్గరలోనే విడిది చేశాడు. ఆ సమయంలో దుర్యోధనుడికీ, గంధర్వులకీ మధ్య ఓ తగాదా చోటు చేసుకుంది. ఆ పోరులో అర్జునుడు, దుర్యోధనుడిని రక్షించాడు. అర్జునుడి సాయానికి ప్రతిఫలంగా దుర్యోధనుడు, తనని ఎప్పుడైనా ఓ వరం కోరుకోవచ్చునని చెప్పాడు. ఆ తతంగమంతా ఇప్పుడు కృష్ణుడికి జ్ఞప్తికి వచ్చింది. వెంటనే అర్జునుడిని పిలిచి తన మనసులోని మాటని చెప్పాడు.

అక్కడ తన శిబిరంలో ఆసీనుడై ఉన్న దుర్యోధనుడు సంతోషాన్ని పట్టలేకపోతున్నాడు. ఈ క్షణంలోనే కురుక్షేత్ర యుద్ధాన్ని జయించినంత సంబరంగా ఉంది అతనికి. ఇంతలో అతని శిబిరంలోకి ఎవరో ప్రవేశించిన అలికిడి వినిపించింది. ఎదురుగా చూస్తే.... అర్జునుడు! ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వారిద్దరూ ఎదురుబొదురుగా ఉన్నారు. కానీ మర్యాద కోసం ‘ఏ పని మీద వచ్చావు?’ అంటూ అర్జునుడిని ప్రశ్నించాడు దుర్యోధనుడు.

‘ఒకనాడు నేను నీ ప్రాణాలను కాపాడినందుకు, ఎప్పటికైనా నేను కోరుకున్న వరం ఒకటి ఇస్తానని మాట ఇచ్చావు గుర్తుందా? ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. నీ చేతిలో ఉన్న అయిదు బాణాలనీ నాకు ఇచ్చెయ్యి!’ అని అడిగాడు అర్జునుడు.

అర్జునుడి మాటలకు దుర్యోధనుడు హతాశుడయ్యాడు. కానీ ఒక క్షత్రియుడిగా ఇచ్చిన మాటకి కట్టుబడక తప్పదు. లేకపోతే తన దృష్టిలో తనే దిగజారిపోతాడు. అందుకని నిశ్శబ్దంగా తన చేతిలోని బాణాలను అర్జునుడి చేతిలో ఉంచాడు. భీష్ముడు రేపు ఉదయం యుద్ధభూమిలో ఇస్తానన్నా వినకుండా వాటిని తన దగ్గరే ఉంచుకున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అలా పాండవుల ప్రాణాలను ఎలాగైనా తీయాలన్న దుర్యోధనుడి ఆశ మరోసారి వమ్మైంది. ఈ కథ మూలభారతంలో ఉందో లేదో కానీ జానపద కథల్లో మాత్రం బాగానే వినిపిస్తుంది.

- నిర్జర.